తెలంగాణకు మరో రెండు రోజులు భారీ వర్షాలు… అప్రమత్తం గా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు…

తెలంగాణకు మరో రెండు రోజులు భారీ వర్షాలు…

అప్రమత్తం గా ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు…

హైదరాబాద్, వార్తటుడే, సెప్టెంబర్ 2 :

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంగళ, బుధవారం రెండు రోజుల పాటు 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్త గూడెం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం సైతం జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

ఈ జిల్లాలో భద్రం…

ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, నల్గొండ, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని నాగుపల్లిలో అత్యధికంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేటలో 11.9 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెళ్ళపాడులో 11.8 సెం.మీ, ములుగు జిల్లా ఏటూరునాగారంలో 11.7 సెం.మీ వర్షం కురిసింది.
ఆయా జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.