నిజామాబాద్ గడ్డమీద కాంగ్రెస్ జెండా
— మేయర్ సీటును కైవసం చేసుకుంటాం
—రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్ వార్తటుడే జనవరి 25:
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.నిజామాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ ఎన్నికల సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం దశాబ్దం కాలం నగరాభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని అన్ని డివిజన్ లు, అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్ అభ్యర్థులకు టికెట్లు ఎవరికి వచ్చినా సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను ఓటర్లకు చేరవేయాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు.ఈ సమావేశంలో రాష్ట్ర నీరుపారుదల శాఖ మంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి మరియు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ వెంకట్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ సభ్యులు తహేర్ బిన్ హుందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యులు గంగాధర్, రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.